రజని అంటే రాజేంద్రప్రసాద్కు ఇంట్రెస్ట్.. ఎందుకంటే..!
on Sep 18, 2021
తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా అలరించిన సినీ జంటల్లో రాజేంద్రప్రసాద్, రజని జోడీ ప్రముఖమైంది. జంధ్యాల సినిమా 'అహ నా పెళ్లంట' (1987)లో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని, రొమాన్స్ను అంత త్వరగా మర్చిపోగలమా! ఆ సినిమాతో పాటు భలే మొగుడు, గుండమ్మగారి కృష్ణులు, భామా కలాపం, జీవన గంగ, చిక్కడు దొరకడు, బంధువులొస్తున్నారు జాగ్రత్త, చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం, గడుగ్గాయి లాంటి సినిమాలతో హిట్ పెయిర్గా పేరుపొందారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో సెట్స్ మీద హీరో హీరోయిన్లు కలసి మాట్లాడుకోవడం అనేది ఉండేది కాదు. షాట్ అయితే ఎవరి రూమ్లోకి వారు వెళ్లిపోయేవారు. అయితే సెట్స్పై రజనితో రాజేంద్రప్రసాద్ కాస్త సన్నిహితంగా మెలిగేవారు. దాంతో ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఉందని అప్పట్లో ఇండస్ట్రీలో వదంతులు షికార్లు చేసేవి. కొన్ని పత్రికలు కూడా వారి మధ్య రిలేషన్షిప్ ఉందంటూ ఉన్నవీ, లేనివీ కల్పించి రాసేవి.
రాజేంద్రప్రసాద్కు ఆరోగ్యం గురించిన శ్రద్ధ ఎక్కువ. "రజనీ నువ్వింత తెల్లగా ఎలా ఉన్నావ్?" అని అడిగేవారు. "ఒక డిటెక్టివ్ లాగా ఆయన నన్ను ఫాలో అవుతుంటారు. ఆ డిటెక్టివ్ డ్రస్ వేసుకోరంతే. ఈమె ఏదో తింటుంది, ఏమో చేస్తుంది అనేది ఆయన అనుమానం. మా మదర్కు ఆయన చాలా క్లోజ్. మా మదర్ చేసే వంటలన్నీ ఆయనకు చాలా ఇష్టం. 'రజనీ ఏం తింటుంది?' అని ఆమెను అడిగారు. 'లేదు బాబూ.. ప్రత్యేకంగా తనేమీ తినదు.' అని ఆమె చెప్పేది. నా డైట్ ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఆయన క్యూరియాసిటీ." అని ఓ ఇంటర్వ్యూలో రజని చెప్పారు.
చాలామంది హీరోయిన్లు రాజేంద్రప్రసాద్తో నటించమని చెప్పిన సందర్భంలో రజని వచ్చి ఆయనతో కలిసి నటించారు. అప్పటికే ఆమె బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, అర్జున్ లాంటి హీరోలతో కలిసి నటిస్తున్నారు. "ఆయనతో కలిసి నటించడానికి నన్ను వచ్చి అడిగినప్పుడు నేను చెప్పిందొక్కటే.. 'నాకు చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ఒకప్పుడు నేనూ కొత్తే, నేనూ చిన్నే. చేస్తాన'ని చెప్పి చేశాను. అందువల్ల నేనన్నా, మా ఫ్యామిలీ అన్నా ఆయనకు ప్రత్యేక అభిమానం. మరోవైపు ఆరోగ్యం గురించిన శ్రద్ధతో నేను భోజనం చేస్తుంటే, నా పక్కన వచ్చి కూర్చోవడం, భోజనమయ్యాక 'బీడా తింటావా?' అనడిగేవారు. మేం అట్లా దగ్గరగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటే చూసేవాళ్లకు ఎవరికైనా అనిపిస్తుంది, ఏదో ఉందని. అందుకే అప్పట్లో మా మధ్య ఏదో ఉందని రాసేవారు." అని చెప్పుకొచ్చారు రజని.
Also Read